
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంక్రాంతి పండుగ సందర్బంగా అందరికీ ఇంద్రధనుస్సు మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసిందే! మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు “శాస్త్రీయ కారణాలు” తెలుసుకుందాం..
‣ “భుగ్” అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాధ స్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ! శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణాల గాథ. సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం వలన ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పీలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు.
ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాన్నిఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దుండగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచీన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కాల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి…!!
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగిరోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్య్ర దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయటం సాయంత్రం భోగిపండ్లు పోయించుకోవడంతో పిల్లలు హుషారుగా ఉంటారు.
భోగి పండుగ రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్ళలో చేమంతి బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. ఈ భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు నువ్వుల లడ్డు జంతికలు చక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.
రెండవ రోజయిన సంక్రాంతి నాట పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి కానీ, మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం, గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యం ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ, కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకాహార మాంసంగా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు